15, ఫిబ్రవరి 2012, బుధవారం

టెట్ లేకున్నా డీఎస్సీ

టెట్ లేకున్నా డీఎస్సీ చాన్స్?
రేపోమాపో సర్కారు తుది నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఉపాధ్యాయ అర్హతా పరీక్ష(టెట్)లో ఇప్పటి వరకు క్వాలిఫై కాని అభ్యర్థులకూ ఇతర అర్హతలన్నీ ఉంటే డీఎస్సీ-2012కి దరఖాస్తు చేసుకుని రాత పరీక్ష రాసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిరుద్యోగ ఉపాధ్యాయుల నుంచి 'టెట్'పై వస్తున్న అభ్యంతరాలపై సర్కారు దృష్టి సారించింది. ఇంతవరకు రెండు సార్లు జరిగిన 'టెట్'లో క్వాలిఫై కాని అభ్యర్థులకు న్యాయం చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

ఈ అంశంపై రేపో, మాపో సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగ అభ్యర్థుల ప్రయోజనార్థం జూన్‌లోనే మూడో 'టెట్' నిర్వహించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. మొదటి 'టెట్'తో పోలిస్తే రెండో 'టెట్' చాలా కష్టంగా ఉందని, రద్దు చేయాలని అభ్యర్థుల నుంచి సర్కారుకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందాయి. అయితే రెండు పరీక్షల మధ్య ఉన్న తేడాను తొలగించేందుకు రెండో 'టెట్' రాసిన అభ్యర్థులందరికీ మోడరేషన్ మార్కులు కలిపిన అనంతరం ఫలితాలను ప్రకటించారు. అయినా, వ్యతిరేకత తగ్గలేదు. కాగా బీఎడ్ అభ్యర్థులు తమను సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకూ దరఖాస్తు చేసు కునేందుకు అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయమై కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆంధ్రజ్యోతి సౌజన్యంతో....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి